Reading Time: < 1 minute

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి 158వ సినిమా కోసం ప్రధాన నటీనటుల ఎంపిక పూర్తి చేస్తున్నారు దర్శకుడు బాబీ. మలయాళ సినీ లెజెండ్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారనుందని చెప్పొచ్చు. విలన్ పాత్రకు సంబంధించిన అప్‌డేట్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ ఫిల్మ్‌మేక, యాక్టర్ అనురాగ్ కశ్యప్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. చిరు-, బాబీ కాంబోలో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

25 రోజుల్లో 375 కోట్లకు పైగా..

సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ సంచలనంగా మారింది. థియేటర్లలో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగో వారంలో కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూనే ఉంది. ఇది చిరంజీవి, అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమౌతోంది. 400 కోట్ల మార్కును చేరుకునే దిశగా దూసుకుపోతోంది.