Reading Time: 2 minutes

ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందన

Caption of Image.

ఢిల్లీ: కేరళం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఫ్రంట్ విజయం సాధించడంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కేరళంలో ప్రతిభ, సామర్థ్యాలకు కొదవ లేదని.. కేరళంలో ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఈ అవకాశాన్ని  యూడీఎఫ్ సద్వినియోగం చేసుకుంటుందని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.

యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు కేరళం ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. కూటమి కార్యకర్తలకు, నాయకులకు రాహుల్ అభినందనలు తెలిపారు.

యూడీఎఫ్ సుమారు 102 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ 35 స్థానాలకే పరిమితమైంది. ఎన్డీయే 3 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. కేరళ ఫలితాలపై రాహుల్ తన ‘ఎక్స్’ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. “నిజంగా నిర్ణయాత్మకమైన తీర్పు ఇచ్చినందుకు కేరళంలోని నా సోదర సోదరీమణులకు ధన్యవాదాలు. అహర్నిశలు శ్రమించి, ప్రచారం చేసి గెలుపునకు కారణమైన ప్రతి యూడీఎఫ్ నాయకుడికి, కార్యకర్తకు అభినందనలు” అని రాహుల్ గాంధీ కేరళ ఫలితాలపై పోస్ట్ చేశారు.

►ALSO READ | తమిళనాడు హంగ్ పాలిటిక్స్: విజయ్కు సపోర్ట్ చేయం.. తేల్చి చెప్పిన అన్నాడీఎంకే !

“నేను ముందే చెప్పినట్లుగా, కేరళలో ప్రతిభ ఉంది, కేరళలో సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఈ రెండింటినీ సద్వినియోగం చేసుకునే దార్శనికతతో యూడీఎఫ్ ప్రభుత్వం ఉంది. త్వరలోనే నా కేరళ కుటుంబాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాను,” అని రాహుల్ పోస్ట్ చేయడం విశేషం. కేరళంలో విజయానికి కారణమైన కేరళం ప్రజలకు కాంగ్రెస్ ధన్యవాదాలు తెలిపింది.

అయితే.. ఇతర రాష్ట్రాల్లో ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా లేవని స్పష్టం చేసింది. అయినప్పటికీ, తాము నిరుత్సాహపడకుండా తమ సిద్ధాంతాల కోసం పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. కేరళంలో కాంగ్రెస్ మెజారిటీ సాధించగా.. అస్సోంలో బీజేపీని గద్దె దించడంలో విఫలమైంది. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలో కూడా కాంగ్రెస్ ఆశించిన రీతిలో రాణించలేక చతికిలపడింది.

©️ VIL Media Pvt Ltd.