Reading Time: < 1 minute
Delhi Pollution Will Be Discussed In Lok Sabha Today

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు అల్లాడిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సరైన వాతావరణం లేక ఆస్పత్రి పాలవుతున్నాయి. ఇక ప్రజలైతే బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో ఢిల్లీ వాసులు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దట్టమైన పొగ మంచుతో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమాన సర్వీసుల్లో కూడా అంతరాయం ఏర్పడుతోంది.

ఇది కూడా చదవండి: Bihar: హిజాబ్ లాగితే తప్పేముంది? నితీష్ కుమార్‌ను వెనకేసుకొచ్చిన కేంద్రమంత్రి

కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో గ్రాఫ్- 4 చర్యలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగాలతో నిర్వహణ.. మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ అమలు చేస్తున్నారు. ఇక పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు నో ఫ్యూయల్ అమలు చేస్తున్నారు. అత్యవసర సేవల వాహనాలు మినహా ఢిల్లీలోకి డీజిల్ వాహనాల నిషేధం విధించారు. గడువు ముగిసిన వాహనాలకు కూడా నిషేధం కొనసాగుతోంది. రాజధాని పరిధిలో నిర్మాణ పనులు కూడా నిషేధించారు. ఉపాధి కోల్పోతున్న కార్మికులకు పదివేల సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 5వ తరగతి వరకు ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక 6 నుంచి 12వ తరగతి వరకు హైబ్రిడ్ విధానంలో తరగతులు జరుగుతున్నాయి.

లోక్‌సభలో చర్చ
ఇదిలా ఉంటే గురువారం ఢిల్లీ కాలుష్యంపై లోక్‌సభలో చర్చ జరగనుంది. విపక్షాల నుంచి ప్రియాంకా గాంధీ, కనిమొళి, డింపుల్ యాదవ్ చర్చ ప్రారంభించనున్నారు. బీజేపి తరపున నిషికాంత్ దూబే, బన్సూరీ స్వరాజ్ మాట్లాడనున్నారు.

ఇది కూడా చదవండి: Trump-White House: జో బైడెన్ చెత్త అధ్యక్షుడు.. వైట్‌హౌస్‌లో అధ్యక్షుల చిత్రపటాల కింద రాతలు