
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి చూపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే పడింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓ అద్భుతమైన రికార్డ్ సృష్టించే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మల సరసన చేరేందుకు కింగ్ సన్నాహాలు రచిస్తున్నాడు.
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే మరో అద్భుత రికార్డును సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్ లో 300 సిక్సర్ల మార్కును చేరుకునేందుకి విరాట్ మరో 9 సిక్సర్లు మాత్రమే కొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఆడిన 267 మ్యాచ్లలో కోహ్లీ మొత్తం 291 సిక్సులు కొట్టాడు. ఒకవేళ సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే తొలి మ్యాచ్లోనే అతడు ఈ ఘనత సాధిస్తే, ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన థర్డ్ బ్యాటర్గా చరిత్రలోకి ఎక్కుతాడు.
ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్స్ లిస్టులో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ తొలిస్థానంలో ఉన్నారు. గేల్ కేవలం 142 మ్యాచ్లలోనే 357 సిక్సులు కొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2025 సీజన్లోనే ఈ 300 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. రోహిత్ ప్రస్తుతం 272 మ్యాచ్లలో 302 సిక్సర్లతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరి సరసన చేరే ఛాన్స్ విరాట్ కోహ్లీకి ఉంది.
►ALSO READ | IPL 2026 : ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. కేకేఆర్తో మ్యాచ్కి స్టార్ ప్లేయర్స్ ఔట్!
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. కోహ్లీకి ఇది సొంత మైదానం కావడంతో.. ఈ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం, దీంతో కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వరద పారే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అతడు 39.54 సగటుతో మొత్తం 8661 రన్స్ సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా 2026 మెగా వేలానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కోహ్లీని రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈరోజు జరగబోయే కీలక పోరులో కోహ్లీ 300 సిక్సర్ల మార్కును అందుకుంటాడో లేదో చూడాలి.