
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ నేరుగా సెకండియర్ ప్రవేశం కోసం నిర్వహించే టీజీ ఈసెట్ – 2026 షెడ్యూల్ను బుధవారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్లొమా, బీ.ఎస్సీ విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ ఏడాది కూడా ఈసెట్ పరీక్ష బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. ఈ మేరకు విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 9 నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18 గా నిర్ణయించారు. ఇక ప్రవేశ పరీక్షను మే 15న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 గా, ఇతర అభ్యర్థులకు రూ.900 గా ఫీజును నిర్ణయించారు. మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. నిర్ణీత గడువు తర్వాత కూడా ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని విద్యామండలి కల్పించనుంది. అర్హత గల విద్యార్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ecet.tgche.ac.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.