
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని మల్లాపూర్ మండలంలోని ముగిలిపేట వద్ద చోటుచేసుకుంది. కొందరు వ్యవసాయ కూలీలు.. పసుపు కోతకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.