Reading Time: < 1 minute

విశాఖపట్నం: శ్రీలంక మహిళలతో ఆదివారం విశాఖపట్నంవేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు సాధించింది. ఓపెనర్ విశ్మీ గుణరత్నె ఒక్కటే కాస్త నిలకడగా రాణించింది. సమన్వయంతో ఆడిన విశ్మీ 39 పరుగులు చేసింది. కెప్టెన్ చామరి ఆటపట్టు (15), హసిని పెరీరా (20), హర్షిత (21) పరుగులు సాధించారు.

భారత బౌలర్లు సమష్టిగా రాణించిప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 14.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (25), షఫాలీ వర్మ (9) శుభారంభం అందించలేక పోయారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా 44 బంతుల్లోనే 10 ఫోర్లతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15 (నాటౌట్) తనవంతు సహకారం అందించింది.