Reading Time: 2 minutes
Ldf Worker Shaves Off Moustache After Losing Bet On Kerala Local Body Poll Win

Kerala: కేరళ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్(యూడీఎఫ్) అధిక స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, బీజేపీ కూడా తన రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, వామపక్ష కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేసిన లెఫ్ట్ కార్యకర్త ఒకరు తన ‘‘మీసం’’ కోల్పోవాల్సి వచ్చింది.

పతనంతిట్ట మన్సిపాలిటీ ఎన్నికల ముందు, ఈ ప్రాంతంలో ఎల్డీఎఫ్ తన అధికారాన్ని నిలుపుకోకపోతే తానున మీసాలు తీసేస్తానని వామపక్ష కార్యకర్త బాబు వర్గీస్ బహిరంగంగా ప్రతిజ్ఞ చేశాడు. శనివారం ఎన్నికల ఫలితాల్లో పతనంతిట్ట మున్సిపాలిటీ మాత్రమే కాకుండా, ఆ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికార ఎల్డీఎఫ్ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ పతనంతిట్ట, తిరువల్ల, పండలంతో సహా నాలుగు మున్సిపాలిటీలను గెలుచుకుంది. గతంలో ఈ మూడు వామపక్షాల ఆధీనంలో ఉండేవి.

Read Also: Bondi Beach Shooting: ఆస్ట్రేలియాను వణికించిన కాల్పులు.. ఉగ్రదాడిలో 10 మంది మృతి.. వైరల్‌గా మారిన వీడియో

అయితే, ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో వామపక్ష కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ, బాబు వర్గీస్ తన స్నేహితులతో పందెం కాశాడు. ఇప్పుడు తన కూటమి ఘోర పరాజయం పాలవ్వడంతో మీసం తీసేస్తాననే తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. స్థానిక సెలూన్‌కు వెళ్లి తన మీసాలు గీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

2025 స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్ అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 86 మునిసిపాలిటీలలో 54, 941 గ్రామ పంచాయతీలలో 504, మరియు 152 బ్లాక్ పంచాయతీలలో 79 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు, వామపక్షాలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్‌లో 101 స్థానాలకు గానూ బీజేపీ 50 స్థానాలు గెలుచుకుంది. ఈ నగరంలో వామపక్షాలు 29, కాంగ్రెస్ కూటమి 19 స్థానాలు గెలిచాయి. గత నాలుగు దశాబ్ధాల వామపక్షాల ఆధిపత్యానికి బీజేపీ గండికొట్టింది.