Reading Time: < 1 minute
Kavitha Janabata Program Comments Double Bedroom Hyderabad Roads

‘జనం బాట’ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 13 జిల్లాల్లో జనం బాట కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ఇంకా 20 జిల్లాలు తిరగాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు.

ప్రజల్లో ముఖ్యంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని కవిత తెలిపారు. రాజకీయ కారణాల వల్లే గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రకటనలు చేస్తున్నారని, కానీ వాస్తవంగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అన్నారు.

హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ పనులు, నీటి కనెక్షన్ల పేరుతో రోడ్లు తవ్వి, పనులు పూర్తయిన తర్వాత సరిగా పూడ్చడం లేదని ఆరోపించారు. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జనం బాట కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను స్థానిక స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అయితే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కవిత సూచించారు.

BJP: ప్రధాని మోడీని ‘‘అంతం’’ చేయడమే లక్ష్యమా..? కాంగ్రెస్‌ ‘‘ఓట్ చోరీ’’ ర్యాలీలో విద్వేష వ్యాఖ్యలు..