Reading Time: 2 minutes
Who Is R Sreelekha Ex Dgp Keralas First Woman Ips Officer And Bjps Likely Mayor In Thiruvananthapuram

R Sreelekha: కేరళలో కమల వికాసానికి నిదర్శనం రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ కైవసం. వామపక్ష, కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్రంగా ఉండే కేరళలో, బీజేపీ రాజధానిని గెలుచుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 45 ఏళ్ల నిరంతర సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి పాలనకు బీజేపీ ముగింపు పలికింది. ఇప్పుడు, త్రివేండ్రం మేయర్‌‌గా బీజేపీ వ్యక్తి రాబోతున్నారు. అయితే, మేయర్ రేసులో కేరళ మాజీ ఐపీఎస్ అధికారిణి, 2020లో డీజీపీగా పదవీ విమరణ చేసిన ఆర్ శ్రీలేఖ ముందు వరసలో ఉన్నారు. శాస్తమంగళం డివిజన్‌లో భారీ మెజారిటీతో గెలిచారు. 64 ఏళ్ల శ్రీలేఖనే త్రివేండ్రానికి కాబోతున్న తొలి బీజేపీ మేయర్‌ అని తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ మేయర్ ఎవరు అవుతారు అనేది స్పష్టంగా చెప్పకున్నా, శ్రీలేఖనే తొలి ప్రాధాన్యత అని తెలుస్తోంది.

అయితే, ఈ విషయంపై మేయర్ ఎన్నికపై బీజేపీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆమె చెబుతున్నారు. శాస్తమంగళంలో ఇంత మెజారిటీలో ఇప్పటి వరకు ఎవరూ గెలించింది లేదని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు. నా అభ్యర్థిత్వాన్ని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ వ్యతిరేకించినా ప్రజలు తనకు అండగా నిలిచారని అన్నారు.

శనివారం ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు, 101 మంది సభ్యులున్న తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ 50 వార్డులను గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 29 స్థానాలను, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాలను గెలుచుకున్నాయి. రెండు వార్డులను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు.

Read Also: Startup Journey: సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి… దోశల వ్యాపారంలోకి వచ్చిన యువకుడు

పోలీస్ నుంచి మేయర్ అభ్యర్థిగా..

తిరువనంతపురంలో పుట్టి పెరిగిన శ్రీలేఖ, జనవరి 1987లో కేరళ మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణిగా నిలిచారు. 30 ఏళ్ల కెరీర్‌లో అనేక జిల్లాలో ఆమె పనిచేశారు. సీబీఐ, కేరళ క్రైమ్ బ్రాంచ్, విజిలెన్స్, ఫైర్ ఫోర్స్, మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్, జైళ్ల శాఖతో సహా కీలక ఏజెన్సీలలో పనిచేశారు. 2017లో డీజీపీగా పదొన్నాతి పొందారు. ఈ హోదా పొందిన తొలి కేరళ మహిళా అధికారిగా రికార్డ్ క్రియేట్ చేశారు. సీబీఐలో పనిచేస్తున్న సమయంలో, ఆమె భయం లేకుండా అనేక దాడులు, అవినీతి వ్యతిరేక చర్యలకు తీసుకున్నారు. దీంతో ఆమెకు ‘‘ రైడ్ శ్రీలేఖ’’ అనే మారుపేరు సంపాదించుకున్నారు. 2020లో పదవీ విరమణ చేశారు.

మలయాళ స్టార్ హీరోయిన్‌పై 2017లో లైంగిక దాడి కేసులో నటుడు దిలీప్ తప్పుగా ఇరికించారని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల, కాంగ్రెస్ నుండి బహిష్కరించబడిన నాయకుడు రాహుల్ మమ్కూటత్తిల్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు దాఖలు చేయడంలో జరిగిన జాప్యాన్ని ప్రశ్నించి ఆమె వివాదానికి తెరలేపారు. అక్టోబర్ 2024లో బీజేపీ చేరిన శ్రీలేఖ కేరళలో కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యారు.