Reading Time: < 1 minute

మధ్య ప్రాచ్య యుద్ధంలో యుద్ధ విరమణ కోసం జరుగుతున్న దౌత్య పరమైన ప్రయత్నాలు కుదేలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా తమ తమ వైఖరిని మరింత కఠినతరం చేసుకున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను అధికారికంగా బలోపేతం చేయడానికి అడుగులు వేస్తుండగా, అమెరికా భూభాగ స్థాయిలో చర్యలకు సిద్ధమవుతూ సైనిక దళాలను ప్రాంతానికి తరలిస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల హెచ్చరికగా సైరన్లు మోగగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అబుదాబి వద్ద క్షిపణి అడ్డుకోవడంలో ఏర్పడిన శకలాల వల్ల ఇద్దరు మృతి, ముగ్గురు గాయపడినట్లు సమాచారం.

ప్రపంచ చమురు, సహజ వాయువులో సుమారు 20 శాతం రవాణా జరిగే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన ఆధిపత్యాన్ని మరింత కట్టుదిట్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుబంధంగా భావించే నౌకలను అడ్డుకుంటూ, కొన్నింటిని మాత్రమే అనుమతిస్తోంది. పార్లమెంట్ స్థాయిలో నౌకల నుంచి రుసుములు వసూలు చేసే విధానాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భద్రత మేమే కల్పిస్తున్నాం కాబట్టి రుసుములు వసూలు చేయడం సహజమే అని ఇరాన్ నాయకులు పేర్కొన్నారు. కొన్ని నౌకలు చైనా కరెన్సీ యువాన్‌లో చెల్లింపులు చేసి ప్రయాణం కొనసాగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నౌకల వివరాలు, సరుకు సమాచారం, గమ్యస్థానంపై కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. వాస్తవానికి హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఒక టోల్ బూత్‌లా నడుపుతోందని భావిస్తున్నారు.