
విదేశాల్లో ఉద్యోగం చేయాలనేది చాలామంది కల… ఇక్కడ సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవారు కూడా ఆన్ సైట్ అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. విదేశాల్లో ఉద్యోగం కోసం లోన్లు తీసుకొని… ఉన్న కాస్తో కూస్తో ఆస్థి కూడా అమ్ముకొని వెళ్లేవారు ఉంటారు. ఇలాంటివారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగం అంటే.. వెనక ముందు చూడకుండా డబ్బుకట్టి మోసపోయినవారు మన ఏపీలోనే ఎక్కువమంది ఉన్నారంట…ఇవి గాలి లెక్కలు కాదు, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు. ఈ లిస్ట్ లో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది.
విదేశాల్లో ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీలకు డబ్బు కట్టి మోసపోయినవారి సంఖ్యలో దేశంలోకెల్లా ఏపీ మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఏపీలో 1495 మంది ఏజెన్సీలు, కన్సల్టెన్సీల చేతిలో మోసపోయారని వెల్లడించింది.
ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు ఉండగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.తెలంగాణకు చెందిన 339 మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం ఏజెన్సీలు, కన్సల్టెన్సీల చేతిలో మోసపోయారని వెల్లడించింది ప్రభుత్వం.
చాలా మంది రిజిస్టర్డ్ విదేశీ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తుండగా, రిజిస్టర్ కాని ఏజెంట్లపై ఆధారపడుతున్నారు. రిజిస్టర్ కానీ ఏజెంట్ల ద్వారా వెళ్ళినవారు మోసం చేయడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.