Reading Time: 2 minutes
Pakistan Political Crisis Mohsin Naqvi Asim Munir Power Struggle

Pakistan:  పాకిస్తాన్‌లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ దేశంలో పెద్ద రాజకీయ కుట్ర, ప్రభుత్వ మార్పు జరుగుతోందనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ చరిత్రలో తిరుగుబాటులు కొత్త కాకున్నా, తాజాగా అసిమ్ మునీర్- నఖ్వీ కలిసి పెద్ద గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. పాక్ హోం మంత్రి, పాక్ క్రికెట్ బోర్డ్ చీప్ మెహ్సీన్ నఖ్వీ, దేశంలో పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

నఖ్వీ తిరుగుబాటు.. మునీర్ మద్దతు:

న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, అధికారులు 21 ఏళ్లుగా లంచాలు తీసుకుంటున్నారని నఖ్వీ ఆరోపించారు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మద్దతుతోనే నఖ్వీ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పొలిటికల్ విశ్లేషకులు, అంతర్జాతీయ రాజకీయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. మోహ్సీన్ నఖ్వీ మీడియా అధిపతి నుంచి శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారని, ఆయనకు చాలా కాలంగా ప్రధాని కావాలనే ఆశ బలంగా ఉందని చెబుతున్నారు. నఖ్వీ చేసిన వ్యాఖ్యల వెనక ఆర్మీ చీఫ్, సర్వసైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. నఖ్వీ అసిమ్ మునీర్‌కి అత్యంత దగ్గరి వ్యక్తిగా పరిగణిస్తారు. అమెరికా- ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి మునీర్ షాబాజ్ ప్రభుత్వాన్ని కాదని నఖ్వీని తన ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు.

బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ప్రజాగ్రహం, పౌర అశాంతి నేపథ్యంలో అసిమ్ మునీర్ తన పట్టు మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. మునీర్ నఖ్వీ ద్వారా దేశంలో కొత్త ప్రావిన్సులు(రాష్ట్రాలు) ఏర్పాటు చేయడానికి పరిస్థితులు కల్పిస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు. గతంలో సైనిక పాలకుడిగా ఉన్న పర్వేజ్ ముషారఫ్‌లా, మునీర్ దేశాధ్యక్షుడు, సైనిక దళాల అధిపతిగా పూర్తి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు పాక్ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

సొంత ప్రభుత్వంలో ప్రకంపనలు:

ఈ వ్యాఖ్యలు సొంత ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిమ్, నఖ్వీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా నఖ్వీ అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్నారని, కనీసం ప్రధానికి జవాబుదారీగా లేరని ఆసిఫ్ అన్నారు. పార్లమెంటరీ సమావేశాల్లో నఖ్వీ తక్కువగా పాల్గొనడంపై ఆయన విమర్శించారు. నఖ్వీ కేవలం రెండుమూడు కేబినెట్ భేటీలకు మాత్రమే వచ్చారని ఆసిఫ్ అన్నారు.

అధికారం చేజిక్కించుకునే దిశగా సైన్యం:

మరోవైపు, పాక్ రాజకీయ రాజధాని ఇస్లామాబాద్, సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావాల్పిండితో వరసగా హైలెవల్ భేటీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రధాని షహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పదవులకు ముప్పుగా భావిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్‌లో బయటకు ప్రజాస్వా్మ్యం, ప్రధాని, మంత్రి మండలి అనే ముసుగు కనిపిస్తున్నా మొత్తం పాలన సైన్యం వద్దే కేంద్రీకృతమై ఉంటుంది. ఇప్పుడు ఈ సైన్యం ప్రత్యక్షంగా తెరపైకి వచ్చి పాలనను పూర్తి స్థాయిలో దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.