
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ప్రజాదరణ పొందుతున్న మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయి ఫైటర్లను ఒకే వేదికపైకి తీసుకురానున్న లెగసీ ఫైటింగ్ ఛాంపియన్షిప్–2 .. ఆగస్టు 22న కాటేదన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ టోర్నీలో మొత్తం 24 మంది ఫైటర్లు బరిలోకి దిగుతుండగా, వారిలో 12 మంది విదేశీ క్రీడాకారులు, ముగ్గురు తెలంగాణకు ఫైటర్లు, మిగతా వారు ఇతర రాష్ట్రాల ప్రముఖ ఎంఎంఏ క్రీడాకారులు. దీంతో ప్రేక్షకులకు హోరాహోరీ పోరాటాలు, ఉత్కంఠ భరితమైన మ్యాచ్లు చూసే అవకాశం లభించనుంది.
ఈ పోటీలకు ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డిని ఆహ్వానించారు. జాతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ సంఘం సహాయ కార్యదర్శి షేక్ ఖలీద్ ఆయనను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మార్షల్ ఆర్ట్స్కు మంచి భవిష్యత్తు ఉందని, ఇలాంటి అంతర్జాతీయ స్థాయి పోటీలు స్థానిక క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్ అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆక్టా ఒరాకిల్ ఎంఎంఏ ప్రమోషన్స్ సంస్థ సీఈఓ సయ్యద్ తల్హా, ఈడీ మహ్మద్ బిలాల్, ఎండీ రహ్మన్ తదితరులు పాల్గొన్నారు.