
లక్నో, ఆగస్ట్ 4: తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఉపాధ్యాయుడు నిద్రపోయాడు. ఇక విద్యార్థులు ఉపాధ్యాయుడి మొబైల్ ఫోన్ తీసుకుని అందులో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వ బడిలో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్ విధులు మరచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో వెలుగు చూసింది. సదరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెట్టింట జోరు చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై పర్యవేక్షణ, ఉపాధ్యాయుల బాధ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
వైరల్ వీడియోలో.. పాఠశాల సమయంలో ఉపాధ్యాయుడు తరగతి బెంచ్పై పడుకుని నిద్రించడం కనిపిస్తుంది. అదే సమయంలో తరగతి గదిలోని విద్యార్థులు ఒక మొబైల్ ఫోన్ చుట్టూ చేరి వీడియోలు చూస్తున్నట్లు తెలుస్తోంది. తరగతి గదిలో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్ధుల భవిష్యత్తు పట్ల పలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అలాగే వీడియో నిజమైనదేనా అనే అంశాన్ని కూడా అధికారులు ఇంకా నిర్ధారించలేదు.
ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఉపాధ్యాయుడిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ వ్యవస్థపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.