
- సంగారెడ్డి జిల్లా జుల్కల్లో ఘటన
సంగారెడ్డి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోవడం, జీవితంపై విరక్తి చెంది ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి కంది మండలం జుల్కల్లో శనివారం జరిగింది, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జుల్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్తో మక్త అల్లూరుకు చెందిన మమత (28)కు 2017లో వివాహమైంది. వీరికి మణికంఠ (3), ప్రణయశ్రీ(2) పిల్లలు ఉన్నారు.
జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ చనిపోయాడు. దీంతో మమత జుల్కల్ గ్రామంలోనే తన ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు, మేనత్తతో కలిసి ఉంటోంది. భర్త చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన మమత జీవితంపై విరక్తి చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని టైంలో తన పిల్లలు మణికంఠ, ప్రణయశ్రీ గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఉరి వేసుకొని తానూ ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.