
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణపై పెద్ద చర్చ సాగుతోంది. ప్రధాని మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ లో బిలియనీర్ ఎలాన్ మస్క్ పాల్గొన్నాడని అమెరికా కు చెందిన అధికారి చెప్పినట్లు ప్రచారం సాగుతున్న క్రమంలో కేంద్రం శనివారం క్లారిటీ ఇచ్చింది. ఇద్దరు దేశాధినేతల ఫోన్ కాల్ లో ప్రైవేట్ వ్యక్తులకు చోటు లేదని, వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది.
మార్చి 24న జరిగిన ఈ ఫోన్ కాల్ కేవలం ఇద్దరు దేశాధినేతల మధ్య మాత్రమే జరిగిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘మార్చి 24న కేవలం ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగింది అని MEA అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.
►ALSO READ | ఎయిర్పోర్టుకు భూమి ఇచ్చి కోటీశ్వరుడైన రైతు : థాయ్లాండ్కు స్పెషల్ ఫ్లైట్లో వెళుతున్నాడు..!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇలాంటి సమయంలో జరిగిన ఉన్నత స్థాయి ఫోన్ కాల్లో ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారని, పేరు వెల్లడించని అమెరికా అధికారులు చెప్పారని ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం వెలువడిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం..మోదీ ,ట్రంప్ మధ్య జరిగిన ఈ సంభాషణ పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులపైనే చర్చ జరిగింది. గతంలో చెప్పిన విధంగానే పశ్చిమాసియాలోని పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకున్నారు ఇరుదేశాల నేతలు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభించి, ఆ ప్రాంతమంతటా ఉద్రిక్తతలను తీవ్రతరం చేసిన తర్వాత.. ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష సంభాషణ ఇదే.