
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు శనివారం (మార్చి 28) ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టం సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో ఎట్ అమరావతి పదాన్ని చేర్చాలని తీర్మానంలో ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. స్పష్టమైన అభివృద్ధి కోసం అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5ని సవరించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అసెంబ్లీలో ఈ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈతీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది.