
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇంధన సరఫరాను రెగ్యులర్ స్థాయికంటే గణనీయంగా పెంచినట్లు సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. రాష్ట్రంలో రోజువారీ సగటు అవసరాలకంటే దాదాపు మూడు రెట్లు ఇంధనాన్ని సరఫరా చేసినట్లు పేర్కొంది. పెట్రోల్ రోజువారీ సగటు 5,883 కిలో లీటర్లతో పోలిస్తే గురువారం 16,609 కిలోలీటర్లు సరఫరా చేసినట్లు వివరించింది.
డీజిల్ సగటు 7,348 కిలో లీటర్లకు బదులుగా, 19,580 కిలో లీటర్లు అందించామని, మొత్తం కలిపి 36,189 కిలో లీటర్ల ఇంధనం సరఫరా చేసినట్లు పేర్కొంది. ఇది సగటు 13,231 కిలోలీటర్ల కంటే దాదాపు 2.7రెట్లు అధికంగా విక్రయాలు జరిగినట్లు తెలిపింది. ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని సివిల్ సప్లయ్స్ వర్గాలు వెల్లడించాయి.