
ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఢిల్లీలో ఈ సీజన్ లోనే అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు దిగజారాయి. మంగళవారం ఉదయం రాజధానిలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ట ఉష్ణోగ్రత. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా తీవ్రంగానే ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం మంగళవారం ఉదయం ఢిల్లీలో ఏక్యూఐ స్థాయిలు వెరీపూర్ కేటగిరీ (337) గా నమోదయ్యాయి.