
హైదరాబాద్: తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి మీ ఎత్తులో మంగళవారం ఏర్పడింది. ద్రోణి ఈరోజు (మంగళవారం) ఉత్తర ఛత్తీస్ గడ్ ప్రాంతంలోని ఉపరితల చక్రవాత ఆవర్తనం నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. అంతర్గత మహారాష్ట్ర సమీపంలోని తెలంగాణ ప్రాంతంలో యాంటీ సైక్లోనిక్ సర్కులేషన్ ఒకటి సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుండి 5.6 కి మీ మధ్యలో కొనసాగుతోంది.
దీంతో రాష్ట్రంలో ఈరోజు (మంగళవారం),రేపు (బుధవారం), ఎల్లుండి (గురువారం) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు(మంగళవారం) ఒక్కరోజు మాత్రం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
►ALSO READ | గోదావరిఖనిలో అగ్నిప్రమాదం… పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న లారీలో మంటలు…
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ) వేగంతో పాటు వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.