Reading Time: < 1 minute
Hyderabad: ఇద్దరు భార్యల మధ్య చిన్నగా మొదలైన గొడవ.. కట్‌చేస్తే.. ఒకరి తర్వాత ఒకరు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సవతుల మధ్య జరిగిన గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకుంది. వాంకిడి మండలం సోనాపూర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆత్రం కన్నుకు ఇద్దరు భార్యలు.. రాంబాయి, సాకృబాయి. ఈ నెల 5న ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరగడంతో.. ఆగ్రహానికి గురైన మొదటి భార్య రాంబాయి కర్రతో రెండో భార్య సాకృబాయిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సాకృబాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

ఈ ఘటనతో భయపడిన రాంబాయి గ్రామం విడిచి పొలంలో తలదాచుకుంది. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకుని.. శనివారం మధ్యాహ్నం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సాకృబాయి మృతదేహం ఇంటికి చేరకముందే రాంబాయి ఆత్మహత్య చేసుకోవడంతో సోనాపూర్‌లో విషాదం నెలకొంది.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో సోనాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.