
చెన్నై నగరంలోని గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఆస్కార్ విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు, ప్రముఖ యువ గాయకుడు ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ వార్త తమిళ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తన స్నేహితుడు భార్గవ్తో కలిసి ఏఆర్ అమీన్ కోయంబేడు నుంచి కారులో బయలుదేరారు. గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే, ఎదురుగా వస్తున్న ఒక కాల్ టాక్సీని వీరి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ అమ్రీన్, ఆయన స్నేహితుడు భార్గవ్ అలాగే టాక్సీ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అమీన్ , ఆయన స్నేహితుడిని చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించగా, ప్రాథమిక చికిత్స అనంతరం వారిద్దరూ సురక్షితంగా నివాసానికి చేరుకున్నారు. మరోవైపు గాయపడిన టాక్సీ డ్రైవర్ను కళైజ్ఞర్ శతాబ్ది ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తండ్రి ఏఆర్ రెహమాన్ లాగే చిన్నతనం నుంచే సంగీతంపై అమితమైన ఆసక్తి పెంచుకున్న అమీన్ , 2015లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓ కాదల్ కణ్మణి’ (తెలుగులో ‘OK బంగారం’) ద్వారా గాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తన విలక్షణమైన, మధురమైన స్వరం ద్వారా సినీ ప్రియులను ఆకట్టుకుంటూ వచ్చారు. శింబు నటించిన ‘పత్తు తల’ చిత్రంలోని ‘నినైవిరుక్కా’, రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలోని ‘సిక్రి’ పాటలతో పాటు హిందీలో ‘భీగీ భీగీ’ ఆల్బమ్ ద్వారా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్తో పాటు యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా కాంబినేషన్లో పలు ఆల్బమ్స్, చిత్రాల్లో పాటలు పాడుతూ, భవిష్యత్తులో తండ్రి తగ్గ వారసుడిగా సంగీత ప్రపంచాన్ని ఏలబోతున్నారనే గుర్తింపు తెచ్చుకున్నారు.