Reading Time: 2 minutes
Tg Bharath Flags Intelligence Failure Over Kurnool Tdp Worker Murder

Minister TG Bharat: కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నిఘా వ్యవస్థ విఫలమైందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే సోషల్ మీడియాలో ఇంతియాజ్ ఫొటో పెట్టి ‘RIP’ అని పోస్ట్ చేసినా పోలీసుల దృష్టికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మంత్రులపై నిఘా పెట్టే వ్యవస్థ నేరస్థులపై ఎందుకు నిఘా పెట్టడం లేదని నిలదీశారు. మంత్రులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలను నిఘా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, అలాంటప్పుడు నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై సమాచారం పోలీసులకు ఎందుకు అందడం లేదని టీజీ భరత్ ప్రశ్నించారు. తనకు అందుతున్న సమాచారం కూడా పోలీసులకు అందడం లేదని, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

ఇంతియాజ్ హత్యపై మంత్రి ఆగ్రహం

కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్‌ను పక్కా పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారని టీజీ భరత్ ఆరోపించారు. ఇంతియాజ్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారని, ఆ సమయంలో నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైసీపీ వర్గీయులు బెదిరించారని, ఆయన ఇంటికి వెళ్లి గొడవకు దిగారని పేర్కొన్నారు. తర్వాత ఇంతియాజ్ టీడీపీలో చేరారని మంత్రి తెలిపారు. హంద్రీ నదిలో జరుగుతున్న వైసీపీ కబ్జాలను ఇంతియాజ్ బయటపెట్టారని, వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే ఆయనను హత్య చేశారని టీజీ భరత్ ఆరోపించారు.

వైసీపీపై తీవ్ర ఆరోపణలు
కర్నూలులో వైసీపీకి చెందిన రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. గత రెండేళ్లలో కర్నూలులో మూడు హత్యలు జరిగాయని, ప్రతి హత్యలోనూ వైసీపీ ప్రమేయం ఉందని తనకు సమాచారం ఉందని టీజీ భరత్ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వైసీపీ నేతల స్పందన తెలియాల్సి ఉంది.

నిందితుడి వ్యాఖ్యలపై ఆందోళన
జైలు నుంచి బెయిల్‌పై బయటకు వస్తున్న సమయంలో ఒక నిందితుడు తిరిగి జైలుకు వస్తానని చెప్పి వెళ్లడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని టీజీ భరత్ అన్నారు. ఇలాంటి పరిణామాలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. కర్నూలులో పరిస్థితులపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి కోరారు. నేరస్థుల కదలికలు, వారి కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

సీఎంకు పరిస్థితులు వివరిస్తా
కర్నూలులో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని టీజీ భరత్ తెలిపారు. పోలీసులు ఇప్పటికైనా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. వైసీపీ ధోరణి ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. కర్నూలులో మళ్లీ పాత తరహా ఫ్యాక్షన్ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1994 నుంచి 2004 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో కర్నూలులో ఫ్యాక్షనిజాన్ని అదుపులోకి తీసుకొచ్చామని టీజీ భరత్ గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ అదే దిశగా వెళ్తే, వాటిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కర్నూలులో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, నేరాలను ముందుగానే గుర్తించేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు మంత్రి టీజీ భరత్..