Reading Time: 2 minutes

చావు ఇలా కూడా వస్తుందా..? పాపం కోతిని తరుముకుంటూ వెళ్లి. ఇలా చచ్చిపోవడం ఏంటో..!

Caption of Image.

ఖజురహో: మధ్యప్రదేశ్లోని ఛత్తర్ పూర్ జిల్లా ఖజురహోలో విషాద ఘటన జరిగింది. ఖజురహో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ‘ది ఖజురహో హెరిటేజ్ రిసార్ట్’లో ఒక హోటల్ ఉద్యోగి కరెంట్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కోతలను తరిమే క్రమంలో ఆ యువకుడు చనిపోవడం గమనార్హం. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో.. అతను టెర్రస్ పైనుంచి కోతులను తరిమేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

చనిపోయిన వ్యక్తిని ఖజురహోకి చెందిన రింకు రైక్వార్‌గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పాపం కేవలం ఐదు రోజుల క్రితమే హోటల్‌లో ఉద్యోగంలో చేరిన రింకు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. వీడియోలో ఏముందంటే.. రిసార్ట్ టెర్రస్ పైకి కోతులొచ్చాయి. కోతులను తరిమికొట్టడానికి రింకు గోడ దగ్గర ఉన్న సుమారు 15 అడుగుల ఎత్తైన ఇనుప పైపును పైకి ఎత్తుతున్నాడు.

కోతులను తరిమేందుకు ఆ ఇనుప కడ్డీ తీసుకుని ముందుకెళ్లాడు. కోతులు అక్కడ నుంచి భయంతో పారిపోయాయి. అయితే.. ఆ ఇనుప కడ్డీని కిందకు దించకుండా.. పైన గమనించకుండా గాల్లోనే వెనక్కి తీసుకురావడంతో హై టెన్షన్ వైర్కు ఆ ఇనుప కడ్డీ తగిలింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు, పొగ వచ్చాయి.

ఇనుప కడ్డీ నుంచి కరెంట్ పాస్ అవడంతో ఆ మంటల్లో రింకు రైక్వార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇనుప కడ్డీ గాల్లో నుంచి కిందపడింది. రింకు రైక్వార్ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇదంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోయింది. ఛాతీ నుంచి పొత్తికడుపు వరకు తీవ్రంగా కాలిపోవడంతో రింకు చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.