Reading Time: < 1 minute

పెంపుడు కుక్క విషయంలో గొడవ… నేషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ పై అల్లరి మూకల దాడి…

Caption of Image.

హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కుక్క విషయంలో గొడవ కారణంగా నేషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ పై దాడికి పాల్పడ్డారు అల్లరి మూకలు. శనివారం ( మార్చి 28 ) వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిరాజ్ కాలనీలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఐదు రోజుల క్రితం క్రీడాకారిణి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఒక వ్యక్తిని కరిచిందనే నెపంతో కొందరు యువకులు ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగారు.కుక్కను ఎందుకు బయటకు వదిలారంటూ నిలదీస్తూ ఆమెపై ఆమె  సోదరీమణులపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా,వారిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేసింది. 

ఈ ఘటనపై హయత్ నగర్ పోలీసులు నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినప్పటికీ, అల్లరి మూకల ఆగడాలు ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై కేసు పెడతారా అంటూ నిందితులు రోజూ ఇంటి వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని, నలుగురు యువకుల నుండి తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని వారు వాపోతున్నారు.​ 

►ALSO READ | ఆకతాయిల ఆట కట్టించేందుకు టెన్త్ స్టూడెంట్గా మారిన టేకుమట్ల SI

వేధింపుల కారణంగా ప్రతిరోజూ ప్రాక్టీస్‌కు వెళ్లాల్సిన క్రీడాకారిణి, ప్రస్తుతం బయటకు రావాలంటేనే భయపడుతున్నట్లు పేరెంట్స్ చెబుతున్నారు.​ నిందితులు బహిరంగంగా తిరుగుతూ తమను వేధిస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని క్రీడాకారిణి కుటుంబం కోరుతోంది. వారిని కరచిన కుక్క తమది కాదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా తమపై దాడి చేశారని ఆరోపించారు.

©️ VIL Media Pvt Ltd.