
హైదరాబాద్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని బిజెపి రద్దు చేయబోతుందని, అధికారం ఉంది కదా అని ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, కోట్లాది మంది పేదలను దేశ పౌరులే కాదని.. చిత్రీకరించారని, ఉపాధి హామీ పథకాన్ని మార్చి పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, దేశంలో 80 శాతం ప్రజలు ఉపాధి హామీ పథకంపై ఆధారపడుతున్నారని తెలియజేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుందని జోస్యం చెప్పారు. ఎన్ డిఎ కూటమికి అనుకున్నమెజార్టీ రాకపోవడంతో.. రాజ్యాంగాన్ని మార్చలేకపోయారని, రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు కానీ.. వేరే రూపంలో హక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.
వ్యవసాయాన్ని నీరుగార్చడం కోసం గతంలో నల్లచట్టాలు తెచ్చారని, నల్ల చట్టాలు ఉపసంహరించుకునేలా చేయడమే కాకుండా జాతికి మోడీ క్షమాపణ చెప్పేలా కాంగ్రెస్ చేసిందని తెలియజేశారు. ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామ సభలో ఉపాధి హామీ చట్టంలో మార్పులపై వ్యతిరేక తీర్మానం చేయాలని, ఓటు హక్కును తీసేసే కుట్రలో భాగంగానే ఎస్ఐఆర్ ను తీసుకొచ్చారని, కోట్లాది మంది పేదలను దేశ పైరులే కాదని చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు నిరసన తెలపాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు పోరాటం చేస్తామని సిఎం పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం విషయంలో జాతికి క్షమాపణ చెప్పేవరకు మోడీ వదలేదిలేదని, భూమి లేని పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ తెచ్చిందని కొనియాడారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలవాలని, బిఆర్ఎస్, బిజెపిలకు రాజకీయాలే తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.