
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు: అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ పనులను స్పీడప్ చేసి, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న 400 మీటర్ల అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులను స్పీడప్ చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు.
జిల్లాలో వసతులను మెరుగుపర్చి జాతీయ స్థాయి పోటీలను నిర్వహించే స్థాయికి ఎదగాలన్నారు. స్థానిక అథ్లెట్లకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం నగరంలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శ్రీ రామ్ హిల్స్ లో రూ.1.20 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీవైఎస్వో తుంబూరు సునీల్ రెడ్డి పాల్గొన్నారు.