
జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నెల్సన్ రాజ్ అనే యువకుడు గతంలో ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదంపై యువతి ఫిర్యాదు చేయడంతో ఇటీవల అల్లాపూర్ పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే, బుధవారం కల్యాణ్ నగర్లోని హైటెన్షన్ టవర్ ఎక్కిన నెల్సన్ రాజ్.. నిద్ర మాత్రలు మింగి తనకు న్యాయం చేయాలంటూ డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న వెంటనే బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పైనుంచి దూకుతానని హెచ్చరిస్తున్న యువకుడిని పోలీసులు ఎంతో ఓర్పుతో బుజ్జగించి, సురక్షితంగా కిందకు దింపారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.