
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్ సిటీ, వెలుగు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదని, ఆయనకు గౌరవం ఇచ్చి ప్రజాప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. జగిత్యాల బీఆర్ఎస్ సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ పోవాలని అంటున్నారని.. ఎందుకు పోవాలని ఆయన ప్రశ్నించారు. రెండున్నర ఏండ్ల కింద ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ లీడర్లకు ఎందుకంత కోపం ఉందని ప్రశ్నించారు.
యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. వచ్చే వానాకాలం యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరం కేసు అంశాన్ని సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ పాల్గొన్నారు.