
- ఫుట్ పాత్, సెంట్రల్ మీడియన్ లో చెట్లను తొలగిస్తున్న అధికారులు
- 1,500 చెట్ల గుర్తింపు
- ‘ఫారెస్ట్’ సూచనతో 380 చెట్ల ట్రాన్స్లొకేట్కు నిర్ణయం
- శంషాబాద్, షేక్పేట్ రాక్ గార్డెన్లో నాటనున్న అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్ పాస్ ల నిర్మాణ పనులను అధికారులు వేగవంతం చేశారు. పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి సంబంధించి 1,500 చెట్లు తొలగించాలని గుర్తించిన జీహెచ్ఎంసీ ఇదివరకే వాటికి నెంబరింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు చెట్ల కొమ్మలను తొలగించే పనిలో పడ్డారు. తొలగించిన మొత్తం చెట్లలో 380 చెట్లను వేరే ప్రాంతానికి తరలించి తిరిగి నాటాలని ఫారెస్ట్ అధికారులు సూచించడంతో.. భారీ క్రేన్లు, ఎర్త్మూవర్ల సాయంతో చెట్లను వేర్లతో సహా సైంటిఫిక్పద్ధతిలో వెలికితీసి ఇతర ప్రాంతాల్లో నాటనున్నారు.
గతంలో బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో కార్రేసింగ్కోసం ఎన్టీఆర్ గార్డెన్ లో ని చెట్లను తొలగించి నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన విధంగా ఈ చెట్లను కూడా ట్రాన్స్ లొకేట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కోనోకార్పస్ చెట్లతో పెద్దగా ఉపయోగం లేదని భావించి వాటిని పక్కనపెట్టనున్నారు. మిగతా చెట్లను శంషాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు, షేక్ పేట్ లోని రాక్ గార్డెన్ లో నాటనున్నారు. చెట్ల తొలగింపు, తరలింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే జంక్షన్లలో ఫ్లైఓవర్ల పిల్లర్ల నిర్మాణం, అండర్ పాస్ తవ్వకం పనులను చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రూ.1,090 కోట్లతో ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాస్లు..
కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1,090 కోట్ల వ్యయంతో ఏడు స్టీల్ ఫ్లైఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొదటి దశలో రూ. 580 కోట్ల వ్యయంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ‘వై’ మాదిరిగా రోడ్ నం. 45 నుంచి యూసఫ్గూడ వెళ్లే రోడ్డు వరకు గ్రేడ్ సెపరేటర్, కేబీఆర్ ఎంట్రెన్స్ నుంచి రోడ్ నెం. 36 వైపు నాలుగు లేన్ల స్టీల్ ఫ్లైఓవర్, యూసఫ్గూడ నుంచి రోడ్ నెం. 45 వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్,..పంజాగుట్ట నుంచి వచ్చే రోడ్ నెంబర్ 2 నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వైపు వెళ్లేందుకు అండర్ పాస్ లు అందుబాటులోకి రానున్నాయి.
సెకండ్ ఫేజ్ లో రూ. 510 కోట్లతో ఫిల్మ్ నగర్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ల కేంద్రంగా పనులు చేపట్టనున్నారు. ఈ రెండు దశల నిర్మాణాలు పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ చుట్టూ ఉన్న జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి రానున్నది.