
అశ్వారావుపేట, వెలుగు: మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే కొండ రెడ్లు సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ జరుపుకునే మామిడికాయల పండుగకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) రాహుల్ హాజరయ్యారు. మండలంలోని గోగులపూడి కొండరెడ్ల కుటుంబాలు ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి ముగిసిన తర్వాత ఒకేచోట చేరి సంప్రదాయ నృత్యాలు చేస్తూ, వంటకాలు వండి కులదైవాలకు సమర్పించి మామిడికాయల పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన కొండరెడ్ల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ, మౌలిక సౌకర్యాలు, విద్య, వైద్యం తదితర వసతులను కల్పించడంలో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.