
- ఓడీ పేరుతో 70 మంది లెక్చరర్లు, టీచర్లు హెడ్ ఆఫీస్లోనే తిష్ట
- వారి ప్లేస్లో గెస్ట్, పార్ట్టైం లెక్చరర్ల నియామకం
- సొసైటీపై ఆర్థికభారం
- సిలబస్ పూర్తి కాక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్లు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల సొసైటీల్లో వింత పోకడ మొదలైంది. స్టూడెంట్లకు పాఠాలు చెప్పాల్సిన గురువులు హెడ్ ఆఫీసులో తిష్ట వేశారు. రెగ్యులర్ పోస్టింగ్ ఒక జిల్లాలో ఉంటే, ‘ఆన్ డ్యూటీ’ (ఓడీ) పేరుతో ఏండ్ల తరబడి హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఈ ‘ఓడీ’ వ్యవహారం ఇప్పుడు గురుకుల సొసైటీలో కలకలం రేపుతోంది. గురుకులాల్లో పనిచేయాల్సిన సుమారు 70 మంది లెక్చరర్లు, టీచర్లు తమకు కేటాయించిన స్కూళ్లలో విధులకు హాజరుకాకుండా.. డిప్యుటేషన్, ఓడీ, అడ్మినిస్ట్రేటివ్ పనులు అంటూ హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నారు.
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ల రిక్రూట్మెంట్ను పూర్తి చేసింది. వీరిలో 25 మందిని ఎస్సీ గురుకుల సొసైటీకి కేటాయించారు. ఇందులో ఎక్కువ మంది హెడ్ ఆఫీస్లోనే పనిచేస్తున్నారు. డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపాలని ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 268 గురుకులాల్లో టీచర్ల కొరత వేధిస్తుండడంతో సిలబస్ పూర్తి కావడం లేదని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
15 ఏండ్లుగా ఒక్క క్లాసు కూడా చెప్పని లెక్చరర్
ఆన్ డ్యూటీ విధానాన్ని ఆసరాగా చేసుకున్న ఓ లెక్చరర్.. 15 ఏండ్ల కింద ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క క్లాసు కూడా చెప్పకుండా.. హెడ్ ఆఫీస్నే తన ఇల్లుగా మార్చుకున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆయనకు ప్రిన్సిపల్గా ప్రమోషన్ రావడమే కాకుండా, ఇన్చార్జి జాయింట్ సెక్రటరీగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
నిబంధనల ప్రకారం మూడు లేదా నాలుగేళ్లకు బదిలీలు జరుగుతుంటాయి. డిప్యుటేషన్ కూడా మూడేండ్లే ఇస్తారు. తర్వాత ఆఫీసర్ల కొరత ఉంటే దానిని పొడిగిస్తారు. లేదంటే తనకు కేటాయించిన కాలేజీలో డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ సదరు లెక్చరర్ మాత్రం 15 ఏండ్లుగా హెడ్ ఆఫీస్లోనే కొలువుదీరడం చర్చనీయాంశంగా మారింది.
సిఫార్సుల పర్వం..
ఆన్డ్యూటీ, డిప్యుటేషన్ వెనుక రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలమైన వారు పట్టణ ప్రాంతాల్లో, ప్రధాన కార్యాలయంలో ఉండేలా సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి తట్టుకోలేక ఉన్నతాధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తోంది. బదిలీ చేయాలని చూసినా, పైస్థాయి నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కారణంగా ఆఫీసర్లు వెనక్కి తగ్గుతున్నారు.
హెడ్ ఆఫీస్లో తిష్టవేసిన వారి స్థానంలో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ప్రభుత్వం గెస్ట్ లేదా పార్ట్టైం లెక్చరర్లను నియమిస్తోంది. వీరికి క్లాస్ల చొప్పున లేదా గౌరవ వేతనం కింద రూ.లక్షల్లో జీతాలు చెల్లిస్తోంది. పోస్ట్ ఒకటే అయినా.. ఇద్దరికీ జీతాలు ఇవ్వాల్సి వస్తుండడం గురుకుల సొసైటీకి భారంగా మారింది. స్థానికంగా పనిచేయాల్సిన వారు ఓడీ పేరుతో మరో చోట ఉండడం, కొత్తగా నియామకాలు చేపట్టలేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది.
డిప్యు టేషన్లు రద్దు చేసి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి
ఎస్సీ గురుకులాల్లో క్లాస్లు చెప్పకుండా ఏండ్ల తరబడి హెడ్ ఆఫీస్లో ఉంటున్న వాళ్ల డిప్యుటేషన్లు వెంటనే రద్దు చేయాలి. రెగ్యులర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా రిక్రూట్ అయిన సీనియర్లు ఉండగా.. రూల్స్కు విరుద్ధంగా జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఒక్క ఏడాది కూడా పాఠాలు చెప్పని వ్యక్తి జేఎస్గా ఉన్నారు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కావాలంటే 50 ఏళ్ల వయస్సు ఉండాలని రూల్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. హెడ్ ఆఫీసులో ఉన్నవాళ్ల ప్లేస్లో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీని నియమించి జీతాలు చెల్లిస్తుండడం సొసైటీపై భారంగా మారుతోంది.
– సాంబలక్ష్మి, స్టేట్ ప్రెసిడెంట్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్