
పాలమూరుకు కాంగ్రెస్, టిడిపి చేసిన ద్రోహాలను రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాకు మేలు జరుగుతుందని కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారని అన్నారు. కానీ, రేవంత్రెడ్డి కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల మాదిరిగా ఆ ప్రాజెక్ట్ను ముందుకు కదవలనివ్వడం లేదని ఆరోపించారు. రెండేళ్లలో చిన్న కాల్వ మట్టి తవ్వితే 50 టిసిఎంల నీటిని నింపుకునే అవకాశం వదిలేసి తమపై రాజకీయంగా దుమ్మెత్తిపోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్రెడ్డి సొంత ప్రాంతానికే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఎపిలో కలవక ముందు తెలంగాణలో 16.03 లక్షల ఆయకట్టు ఉందని, ప్రస్తుతం 48.74 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించామని చెప్పారు. 2004 నుంచి -14 మధ్య కాంగ్రెస్ 5.71 లక్షల ఎకరాల ఆయకట్టే సాధించిందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ హయాంలో 17.24 లక్షల ఎకరాల ఆయకట్టు తెచ్చినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎస్ఆర్ఎస్పి స్టేజ్-2కు నీళ్లు అందించామని, కాంగ్రెస్ తెచ్చిన ఆయకట్టు కన్నా ఏడున్నర రెట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి
రాయలసీమ ఎత్తిపోతలను ఆపిందే తానేనని అసెంబ్లీలో రేవంత్రెడ్డి చెప్పారని..కానీ, కానీ రేవంత్ వ్యాఖ్యలు ఖండిస్తూ ఎపి ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని హరీష్రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు..బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జిటికి వెళ్లి స్టే తెచ్చిందని ప్రకటనలో పేర్కొందని అన్నారు. ఇప్పుడు రేవంత్రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు, శాసనసభను తప్పుదోవ పట్టించిన రేవంత్ రెడ్డి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జిఒ 2020 మే 5న వచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు జిఒ రాకముందే అపెక్స్ కౌన్సిల్లో తాము ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆనాడే అభ్యంతరం చెప్పామని అన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతలపై కెసిఆర్ గట్టి పోరాటం చేశారని, కెసిఆర్ ప్రయత్నాల వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని ఎపి ప్రభుత్వానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు.