
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్’ ఏర్పాటు చేయబోతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్లు ప్రారంభించామని, కేన్సర్ స్క్రీనింగ్, డయాగ్నసిస్, కీమోథెరపీ వంటి సేవలు ఈ క్లినిక్లలో అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కేన్సర్ పేషెంట్లు కీమో థెరపీ కోసం హైదరాబాద్ వరకూ రావాల్సిన అవసరం లేకుండా, జిల్లా కేంద్రాల్లోని డే కేర్ కేన్సర్ సెంటర్లలో సేవలు అందిస్తున్నామన్నారు.దీంతో ఎంఎన్జే హాస్పిటల్ మీద పేషెంట్ లోడ్ కూడా తగ్గిందని మంత్రి తెలిపారు. కేన్సర్ కేర్ సెంటర్ల తరహాలోనే, ప్రజలకు నిరంతర కంటి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఐ కేర్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రస్తుత జీవనశైలి, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో కంటి సమస్యలు అధికమవుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కంటి వెలుగు తరహాలో తాత్కాలిక శిబిరాలకు పరిమితం కాకుండా, శాశ్వత ప్రాతిపదికన వైద్యం అందించేలా ‘ఐ కేర్ క్లినిక్స్’ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ క్లినిక్ల నిర్వహణలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ‘హబ్’ గా వ్యవహరిస్తుందన్నారు. హబ్, క్లినిక్ల మధ్య సమన్వయం కోసం, స్క్రీనింగ్, సర్జరీలను పర్యవేక్షించడానికి ఒక ఆప్తాల్మాలజీ నిపుణుడిని ‘నోడల్ ఆఫీసర్’గా నియమించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కంటి వ్యాధుల తీవ్రతను అధ్యయనం చేయడానికి, సరైన చికిత్సా విధానాలను సిఫార్సు చేయడానికి ఇప్పటికే ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఐ కేర్ సెంటర్ల పనితీరుపై, విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మంత్రి సభ ముందుంచారు.