Reading Time: 2 minutes
Imd Alert Delhi Red Fort Independence Day Rain Forecast August 15

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ ప్రజలంతా శనివారం పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకోనున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర వాతావరణ శాఖ వరుణుడి వార్త చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర రేపు ఉదయం 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 15వ తేదీన ఉదయం 8:30 నుంచి 11:30 గంటల మధ్య వర్షం కురిసే అవకాశం 80 శాతం ఉందని.. వేడుక జరిగే సమయంలో తేలికపాటి వర్షం, మేఘావృతమైన ఆకాశం ఉండే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి మోడీ ఎర్రకోటలో జరిగే కార్యక్రమానికి హాజరై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే ఉదయం వేళల్లో వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా నిర్వాహకులు, భద్రతా సంస్థలు తమ ఏర్పాట్లలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తేలికపాటి వర్షం కూడా ఏర్పాట్లకు అంతరాయం కలిగించవచ్చు.

ఉదయం తర్వాత కూడా రోజంతా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల మధ్య ఒకటి నుంచి రెండు మిల్లీమీటర్ల వర్షం పడే అవకాశం 75 శాతం ఉంది. ఈ అవకాశం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య 50 శాతానికి తగ్గుతుంది. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య వర్షం పడే అవకాశం 25 శాతానికి మరింత తగ్గుతుంది. అయితే రాత్రి 8:30 నుంచి 11:30 గంటల మధ్య మరో మూడు నుంచి నాలుగు మిల్లీమీటర్ల వర్షం పడేందుకు 70 శాతం అవకాశం ఉంది.

ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వేలాది మంది ప్రజలు హాజరయ్యే ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. చిరుజల్లు పడినా కూడా వేదిక, జెండా ఎగురవేసే ప్రదేశం,గ్యాలరీలలో నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. భద్రతా దళాలు, పారిశుధ్య కార్మికులు, నిర్వాహక కమిటీ వారు ముందుగానే తగినన్ని కప్పులు, తాత్కాలిక షెడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటు చేసి ఉండేలా చూసుకోవాలి. అతిథులు, ప్రేక్షకులు కూడా వాతావరణానికి అనువుగా సిద్ధపడి రావాలని సూచించింది. వర్షాకాలంలో ఢిల్లీలో వర్షాలు పడటం సాధారణమే.. కానీ జాతీయ పండుగ రోజున వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండటం ఈ కార్యక్రమాన్ని సవాలుగా మారనుంది.

పౌరులకు సలహా

బయటకు వెళ్లే ముందు తాజా సమాచారాన్ని తనిఖీ చేయమని పౌరులకు ఐఎండీ సూచించింది. గొడుగు లేదా రెయిన్‌కోట్ వెంట తీసుకువెళ్లడం మంచిదని తెలిపింది.