Reading Time: 2 minutes
సెడాన్స్, ఈవీల కోసం ప్రత్యేకంగా టైర్లు..! మిష్లిన్ ప్రైమసీ 5 టైర్‌‌ ప్రత్యేకతలు ఇవే

మిష్లిన్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం టైర్ ప్రైమసీ 5ని అధికారికంగా విడుదల చేసింది. సెడాన్లు, ఎస్‌యూవీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ టైర్‌ను ఇప్పుడు భారత్‌లోనే తయారు చేస్తున్నారు. భద్రతకు పెద్దపీట వేస్తూ అత్యుత్తమ మన్నిక, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే సరికొత్త టైర్ మార్కెట్లో అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ ప్రీమియం ప్రైమసీ 5 మోడల్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.

తొలి మిష్లిన్ ప్యాసింజర్ కార్ టైర్​..

మన దేశంలో స్థానికంగా తయారైన తొలి మిష్లిన్ ప్యాసింజర్ కార్ టైర్ కూడా ఇదే కావడం మరో ప్రత్యేకత. ప్రైమసీ 5 టైర్లు ఈ నెల నుంచే దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. మిష్లిన్ అధికారిక టైర్స్ అండ్ సర్వీస్ సెంటర్లతో పాటు దాదాపు 800కు పైగా ఆథరైజ్డ్ డీలర్ల దగ్గర వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ టైర్లు 16 అంగుళాల నుంచి 22 అంగుళాల వరకు పలు సైజుల్లో లభిస్తున్నాయి. ఈ టైర్ ప్రారంభ ధర సుమారు రూ. 10,000గా నిర్ణయించారు. ఈ కొత్త టైర్లలో భద్రతకు పెద్దపీట వేసినట్లు మిష్లిన్ తెలిపింది. ముఖ్యంగా తడి రోడ్లపై బ్రేకింగ్ పనితీరు గత మోడల్‌తో పోలిస్తే మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

కొత్త టైర్ ఉన్నప్పుడు తడి రోడ్డుపై బ్రేకింగ్ దూరం పోటీ బ్రాండ్లతో పోలిస్తే గరిష్టంగా 8 మీటర్లు తక్కువగా ఉండగా, టైర్ అరిగిన తర్వాత కూడా 9 మీటర్ల వరకు తక్కువ బ్రేకింగ్ దూరాన్ని అందిస్తుందని వెల్లడించింది. పొడి రోడ్లపై కూడా సుమారు 4 మీటర్ల వరకు మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యం ఉంటుందని వెల్లడించింది. కొత్త ప్రైమసీ 5 టైర్లు గత తరం ప్రైమసీ 4ఎస్టీతో పోలిస్తే సుమారు 8 శాతం ఎక్కువ టైర్ లైఫ్ అందిస్తాయి. దీంతో టైర్లు ఎక్కువ కాలం మన్నికగా పనిచేసే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రబ్బర్ కాంపౌండ్, కొత్త ట్రెడ్ డిజైన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది.

ఫ్యూయల్ ఎఫిషియెన్సీ

కంఫర్ట్ విషయంలో కూడా ఈ టైర్లు మంచి అనుభూతిని అందిస్తాయని మిష్లిన్ వెల్లడించింది. అదే విభాగంలోని ఇతర ప్రీమియం టైర్లతో పోలిస్తే సుమారు 9 శాతం ఎక్కువ కంఫర్ట్ అందిస్తాయని తెలిపింది. రోడ్డుపై వచ్చే వైబ్రేషన్లు, శబ్దాన్ని తగ్గించేలా వీటిని రూపొందించారు. దీంతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ టైర్లు పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా అనుకూలంగా ఉంటాయి.

ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో కూడా ఇవి సాయపడుతాయని మిష్లిన్ తెలిపింది. పాత ప్రైమసీ 4ఎస్టీతో పోలిస్తే సుమారు 6.4 శాతం మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ అందిస్తాయని తెలిపింది. అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ వినియోగం తగ్గి, డ్రైవింగ్ రేంజ్ పెరగడానికి కూడా ఈ టైర్లు ఉపయోగపడతాయని వివరించింది.

భారతీయ రోడ్లకు తగినట్లు

భారత రోడ్లు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ టైర్లను అభివృద్ధి చేసి పరీక్షించినట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచస్థాయి సాంకేతికతను భారతీయ తయారీ సామర్థ్యంతో కలిపి రూపొందించిన ఈ టైర్లు, ప్రీమియం కార్ల వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన పనితీరు, ఎక్కువ మన్నిక, మంచి కంఫర్ట్‌ను అందిస్తాయని మిష్లిన్ వెల్లడించింది. విభిన్న ప్రయాణ అవసరాలను తీర్చేలా రూపొందించిన ఈ టైర్లు ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందనున్నాయి. నాణ్యతతో రాజీ పడకుండా తయారు చేసిన ఈ ఉత్పత్తులు వాహనదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తాయి.