
Tirupati: డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా వివాదంగా మారి బెదిరింపుల వరకు వెళ్లిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. పెళ్లికి ముందే ఆస్తులు, నగదు కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నిశ్చితార్థం రద్దు చేసుకున్న యువకుడిని.. కేసు ఉపసంహరించుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించినట్లు తెలిసింది.
తిరుపతికి చెందిన సైంటిస్ట్ వంశీకి హైదరాబాద్కు చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న నమ్రతతో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే ఆస్తులు, నగదు విషయంలో వేధింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ వంశీ కుటుంబం నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
ఈ క్రమంలో నమ్రత వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వంశీపై క్రైమ్ నంబర్ 984/2025 కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వంశీ ప్రస్తుతం తిరుపతిలోని పోస్టల్ కాలనీలో తన స్నేహితులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. అయితే తన ఫోన్ నంబర్ను వంశీ బ్లాక్ చేయడంతో నమ్రత ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు వంశీ తెలిపారు. తనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలంటే తనకు రూ.3 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు.
దీనితో వంశీ తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని, రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. వంశీ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డేటింగ్ యాప్ పరిచయంతో మొదలైన వ్యవహారం.. నిశ్చితార్థం రద్దు, పోలీసు కేసులు, ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు, రూ.3 కోట్ల డిమాండ్ వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.