
- అమ్ముతుండగా నలుగురిని పట్టుకున్న బేల పోలీసులు
ఆదిలాబాద్టౌన్(బేల), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ఓ ముఠాను పట్టుకున్నట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం బేల పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సాంగిడి గ్రామానికి చెందిన జిట్టావార్ కిశోర్రెడ్డి అనే వ్యక్తి గుజరాత్కు చెందిన నరేశ్ క్రాప్ సైన్స్ కంపెనీలో కమీషన్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ధర్మేశ్ కచ్చడియా అనే వ్యక్తితో కలిసి మౌళి-555 పేరుతో ఉండే ఒరిజినల్ పత్తి విత్తనాలకు మౌళి-5 పేరుతో నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు.
గత రెండు నెలలుగా గుజరాత్నుంచి సుమారు 4,500 నకిలీ ప్యాకెట్లు తెప్పించి అందులో 4,350 ప్యాకెట్లను మహారాష్ట్రలో రైతులకు అమ్మారు. మిగిలిన 150 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.60 వేలు, ఒక బైక్, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైతులు లైసెన్స్ఉన్న విత్తన దుకాణాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో సీఐ ఫణిందర్, ఎస్సై
మధుకృష్ణ పాల్గొన్నారు.