
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జోరుగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బూతుల దగ్గర బారులు తీరారు. 5 కోట్ల 73 లక్షల మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఉత్సాహంగా తరలి వస్తున్నారు.
పోలింగ్ బూతుల దగ్గరకు వస్తున్న ఓటర్లకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది రోబో టీనా. ఓటు వేయటానికి వచ్చే ఓటర్లను హాయ్.. హలో.. వెల్ కం అంటూ స్వాగతం పలుకుతుంది. ఓటర్లను చాక్లెట్లు ఇస్తుంది. కోయంబత్తూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పోలింగ్ బూత్లో రోబో టీనా చాక్లెట్లతో ఓటర్లకు స్వాగతం పలుకుతూ ఓటర్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
రోబో టీనా.. సంప్రదాయ బద్దంగా పట్టు పావడ ధరించటం విశేషం. రోబో టీనా చేతిలోని ఓ ప్లేటులో చాక్లెట్లతోపాటు గులాబీలు ఉన్నాయి. ఓటు వేయటానికి వచ్చే ఓటర్లకు గులాబీ పూలు, చాక్లెట్లు ఇస్తూ మహిళలను ఆశ్చర్యపరుస్తుంది.
ఉదయం 9 గంటల వరకు జరిగిన ఓటింగ్ తీరును పరిశీలిస్తే.. అధికారికంగా 18 శాతం వరకు పోలింగ్ నమోదైంది. రాజకీయ పార్టీల నేతలతోపాటు సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎండాకాలం కావటం.. మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటర్లు ఉదయం సమయమే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ బూతుల దగ్గర ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరటం కనిపించింది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ చూస్తుంటే.. పోలింగ్ శాతం భారీగా నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 76.6 శాతం ఓట్లు నమోదయ్యాయి.