
- ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఆఫీసర్లు
నల్గొండ, వెలుగు : నల్గొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో బుధవారం విజిలెన్స్ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ దశరథ మనోజ్కుమార్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కు చేరుకున్న అధికారులు పలు డాక్యుమెంట్లు, రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. స్లాట్ బుకింగ్ జరిగిన విధానంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ శాఖ నుంచ ధ్రువీకరణ పత్రాలు లేకుండా అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళలు, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిని విజిలెన్స్ కార్యాలయానికి తరలించి వీరంతా ఎవరు ? ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు ? జీతం ఎంత ? ఎక్కడి నుంచి ఇస్తున్నారు ? అనే విషయాలపై విచారణ చేపట్టారు. కొన్నేండ్ల కిందటి నుంచి జరిగిన డాక్యుమెంట్లను పరిశీలించారు. విజిలెన్స్ సోదాల నేపథ్యంలో సబ్రిజిస్ట్రార్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులను బంద్పెట్టారు.