
- తెలుగు న్యూస్ ప్లాట్ ఫామ్స్లో తిరుగులేని రికార్డు
హైదరాబాద్, వెలుగు: వీ6 న్యూస్ చానెల్ మరో మైలురాయి చేరుకున్నది. యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్లు కోటీ 20 లక్షలకు చేరారు. ట్రెండింగ్ జమానాలోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తూ.. అనతికాలంలోనే ఆర్గానిక్ న్యూస్తో అందరితో కనెక్ట్ అయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2012 మార్చిలో వీ6 న్యూస్ చానెల్ ప్రారంభం కాగా.. ఏడాది తర్వాత యూట్యూబ్ చానెల్ మొదలైంది. ఏడాదిన్నరకే లక్ష మంది సబ్ స్ర్కైబర్లతో మొదటి మెట్టు ఎక్కింది. రెండేండ్లకు 2017 సెప్టెంబర్ నాటికి 10 లక్షల మంది సబ్ స్ర్కైబర్లను సొంతం చేసుకుని..యూట్యూబ్ గోల్డెన్ బటన్తో రికార్డు క్రియేట్ చేసింది.
2020 జూన్ నాటికి 50 లక్షల మంది సబ్ స్ర్కైబర్లు, ఆ తర్వాత మూడున్నరేండ్లలో మరో 50 లక్షల మందితో కోటి సబ్ స్ర్కైబర్ల మార్క్ అందుకున్నది. యూట్యూబ్ డైమండ్ ప్లే బటన్ దక్కించుకున్నది. ఇక్కడితో వీ6 జర్నీ ఆగలేదు. అంతకుమించి రికార్డులు సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్నది. కోటి పది లక్షల సబ్ స్క్రైబర్స్తో.. తెలుగు న్యూస్ ప్లాట్ ఫామ్స్లోనే మరో రికార్డు అధిగమించింది. ఇప్పుడు కోటి 20లక్షల సబ్స్క్రైబర్స్తో తిరుగులేని రికార్డుల్లోకి ఎక్కింది.
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో జనం గొంతుకగా వచ్చిన చానల్.. మన బతుకులను చూపిస్తూ విజయవంతంగా ముందుకు పోతున్నది. తెలంగాణతోపాటు ఏపీ, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన తెలుగోళ్లకు దగ్గరైంది. తీన్మార్ వార్తలతో ప్రతిరోజూ జనం గుండెను తడుతోంది. పల్లెవార్తలు, సిటీ న్యూస్, నేషనల్, ఇంటర్నేషనల్ వార్తలు, కల్చర్, ఎంటర్ టైన్ మెంట్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్కు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ.. రికార్డుస్థాయి సబ్స్క్రైబర్లతో దూసుకుపోతున్నది.