
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతోపాటు పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు.
న్యూఢిల్లీ, వెలుగు: బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతోపాటు పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో సీఎం శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు సీఎం వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతల వలన దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలవగలదని వివరించారు.
హైదరాబాద్లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని కోరారు.
ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శనివారం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో సీఎం రేవంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో సరదాగా మాట్లాడారు. మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సైతం రేవంత్ రెడ్డిని కలిశారు.