Reading Time: 2 minutes
Tadipatri Tension Police Deny Permission For Ysrcp Tdp Programmes

Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైసీపీ, టీడీపీలు తలపెట్టిన రాజకీయ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి వైసీపీ పిలుపునివ్వగా.. మరోవైపు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే, రెండు ప్రధాన పార్టీల కార్యక్రమాలకు ఎలాంటి పోలీసు అనుమతులు లేవని తాడిపత్రి ఇన్‌చార్జి డీఎస్పీ ఏ. శ్రీనివాస్ స్పష్టం చేశారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, సాధారణ ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అదే సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటికీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పట్టణంలో ఇరుపార్టీల కార్యకలాపాలపై ఉత్కంఠ నెలకొంది. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం లేదా పెద్ద సంఖ్యలో గుమిగూడేందుకు ప్రయత్నించడం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాడిపత్రి పట్టణంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

​డీఎస్పీ సూచనలు..
* శాంతి భద్రతలకు ప్రాధాన్యం : తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, వాటి నాయకులు మరియు కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
* ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పోలీస్ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా గుమ్మిగూడే ప్రయత్నాలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* భద్రత పెంపు : పట్టణంలో ముందస్తు జాగ్రత్త చర్యగా అదనపు పోలీస్ బలగాలను మోహరించడం జరిగిందని, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తే, వారిపై చట్టపరమైన కఠినమైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు.