Reading Time: 2 minutes
Ap Local Body Elections Govt Ready Once Court Cases Are Resolved

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎన్నికల సన్నద్ధతపై వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమైతే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం.. డివిజన్లు, వార్డుల పునర్విభజనకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన 20 రోజుల్లో సుమారు 100 పురపాలికలు, నగర పంచాయతీల్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయగలమని వెల్లడించింది. 2021లో ఎన్నికలు జరిగిన 100 పురపాలికలు, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో 87 చోట్ల పాలకవర్గాల పదవీకాలం మార్చితో ముగిసింది. మరో 13 చోట్ల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 22 వరకు కొనసాగనుంది. పదవీకాలం ముగిసిన 87 స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పురపాలక శాఖ ఎస్‌ఈసీకి తెలిపింది.

ఇదిలా ఉండగా.. సమీప గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనం చేసేందుకు తీసుకొచ్చిన చట్టం-5ను సవాల్ చేస్తూ హైకోర్టులో 35 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో 2021లో 23 పురపాలికలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థతో పాటు శ్రీకాళహస్తి, కావలి, ఆలూరు పురపాలికలు, నగర పంచాయతీలకు సంబంధించిన కొన్ని రిట్ పిటిషన్లు ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన కేసులను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ వెల్లడించింది.

మరోవైపు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ కూడా సన్నద్ధత వ్యక్తం చేసింది. 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలను ప్రచురించి ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపింది. అయితే కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల సుమారు 100 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. 2021 ఎన్నికల సమయంలో హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా 354 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అప్పట్లో సుమారు 13,100 పంచాయతీలకే ఎన్నికలు జరిగాయి. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాలు పరిష్కారమై, వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం, సంబంధిత శాఖలు సిద్ధంగా ఉన్నట్లు ఎస్‌ఈసీకి స్పష్టత ఇచ్చాయి. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై మరోసారి కదలిక మొదలైనట్లు తెలుస్తోంది.