
PM Modi Meets Commonwealth Games 2026 Medallists: కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (ఆగస్టు 9) న్యూఢిల్లీలోని తన నివాసంలో కలిశారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్రీడాకారులతో సమావేశమైన వీడియోను ఇన్స్టాగ్రామ్లో రీల్ రూపంలో పంచుకున్నారు. బాక్సింగ్లో స్వర్ణ పతకం సాధించిన సాక్షి చౌదరితో మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఈ వీడియోను ఎక్స్, ఫేస్బుక్ ఖాతాల్లోనూ షేర్ చేశారు.
‘జో ఖేలేగా, వో ఖిలేగా’ అంటూ మోడీ
క్రీడాకారులను ఉద్దేశించి ప్రధాని మోడీ “జో ఖేలేగా, వో ఖిలేగా. ఆల్వేస్ చీర్ ఫర్ భారత్” అంటూ సందేశం ఇచ్చారు. అనంతరం “భారత్ మాతా కీ జై” అంటూ నినదించగా, క్రీడాకారులు కూడా ఆయనతో కలిసి నినాదాలు చేశారు. ప్రధానిని కలవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని సాక్షి చౌదరి తెలిపారు. మోడీ ఎంతో సాదాసీదాగా, ఆత్మీయంగా క్రీడాకారులతో మాట్లాడారని ఆమె పేర్కొన్నారు.
51 కిలోల విభాగంలో సాక్షికి స్వర్ణం
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 51 కిలోల బాక్సింగ్ విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణ పతకం సాధించారు. ఫైనల్లో ఇంగ్లండ్కు చెందిన రూబీ వైట్పై ఆమె 5-0 తేడాతో విజయం సాధించారు. రూబీ వైట్కు ఇది 69 పోరాటాల్లో తొలి ఓటమి కావడం విశేషం. అంతకుముందు వరుసగా 68 బౌట్లలో ఆమె ఓటమి లేకుండా కొనసాగారు. అయితే యువ ప్రపంచ ఛాంపియన్ సాక్షి చౌదరి అద్భుత ప్రదర్శనతో ఆమెను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
బాక్సింగ్లో భారత్కు చారిత్రాత్మక ప్రదర్శన
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు రికార్డు స్థాయి ప్రదర్శన చేశారు. గ్లాస్గోకు వెళ్లిన 14 మంది భారత బాక్సర్లలో 10 మంది పతకాలు సాధించారు. ఇందులో 7 స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్లో భారత బాక్సింగ్ జట్టు సాధించిన అత్యధిక పతకాలు ఇవే. గతంలో 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 9 బాక్సింగ్ పతకాలు సాధించింది. ఆ రికార్డును గ్లాస్గోలో భారత బాక్సర్లు అధిగమించారు.
భారత బాక్సర్ల స్వర్ణ పతకాల జాబితా
భారత్ తరఫున ప్రీతి పవార్ (54 కిలోలు), జాస్మిన్ లంబోరియా (57 కిలోలు), సాక్షి చౌదరి (51 కిలోలు), ప్రియా ఘాంగాస్ (60 కిలోలు), అరుంధతి చౌదరి (70 కిలోలు), సచిన్ సివాచ్ (60 కిలోలు), అంకుష్ పంఘాల్ (80 కిలోలు) స్వర్ణ పతకాలు సాధించారు. అదే సమయంలో లోవ్లినా బోర్గోహైన్ (75 కిలోలు), జదుమణి సింగ్ (55 కిలోలు), నరేందర్ బెర్వాల్ (90 కిలోలకు పైగా) రజత పతకాలు సాధించారు.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు 39 పతకాలు
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో సాధించిన 61 పతకాలతో పోలిస్తే ఈసారి సంఖ్య తగ్గింది. అయితే గత ఎడిషన్లో భారత్కు పతకాలు అందించిన తొమ్మిది క్రీడాంశాలు ఈసారి గ్లాస్గో గేమ్స్లో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. బాక్సింగ్లో 10 పతకాలు సాధించగా, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్లోనూ భారత్కు కలిపి 10 పతకాలు లభించాయి. వెయిట్లిఫ్టింగ్, పారా వెయిట్లిఫ్టింగ్లో 8 పతకాలు వచ్చాయి. జూడోలో భారత్ 4 పతకాలు సాధించింది.
జూడోలో తొలిసారిగా భారత్ స్వర్ణ పతకం సాధించడం కూడా ఈ గేమ్స్లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. అస్మితా డే భారత తొలి జూడో స్వర్ణ పతక విజేతగా చరిత్ర సృష్టించగా, హర్ష్ సింగ్ కూడా తన విభాగంలో స్వర్ణం సాధించారు. క్రీడాకారులను అభినందిస్తూ ప్రధాని మోదీ చేసిన ‘జో ఖేలేగా, వో ఖిలేగా’ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Delighted to host our outstanding medal winners from the Commonwealth Games 2026 at 7, Lok Kalyan Marg. Heard about their experiences from the Games.
Each one of them has made our nation proud through their exceptional performances. Their success will motivate many youngsters. pic.twitter.com/1zkYCKiV8r
— Narendra Modi (@narendramodi) August 9, 2026