
- సమన్వయ చర్చల్లో రైల్వే జీఎం సంజయ్, సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్సిటీ, వెలుగు : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్పీడప్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. గురువారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సీఎస్ కె. రామకృష్ణారావు నేతృత్వంలో ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే అధికారుల మధ్య ఈ స్థాయిలో జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం విశేషం.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న రోడ్ అండర్ బ్రిడ్జ్ (ఆర్ యూబీ), రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) పనులు, కొత్త రైలు మార్గాల నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధిపై రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భూసేకరణ, విద్యుత్ లైన్లు, పైప్లైన్ల తరలింపు, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఎన్వోసీ) త్వరగా అందేలా చూడాలని రైల్వే అధికారులు కోరారు.హైదరాబాద్ నగరాన్ని బెంగళూరు, చెన్నై, పుణె నగరాలతో కలిపే ‘హై స్పీడ్ రైల్ కారిడార్’ ప్రతిపాదనపై ప్రాథమిక చర్చలు జరిగాయి. దీనితో పాటు రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు పురోగతిని కూడా అధికారులు సమీక్షించారు.