Reading Time: 2 minutes

జీతాల పెంపు కోసం కార్మికుల విధ్వంసం : కార్లు, బైక్స్ తగలబెట్టారు.. రాళ్ల దాడితో బీభత్సం

Caption of Image.

కార్మికుల ఆగ్రహంతో నోయిడాలోని పారిశ్రామికవాడ తగలబడి పోయింది. కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. పోలీసు వాహనాలు పల్టీ కొట్టాయి. కంపెనీ ఇన్ ఫ్రా దెబ్బతింది. కార్మికుల స్లోగన్స్ తో, పోలీసుల హెచ్చరికలతో నోయిడాలోని ఫేస్ 2 రణరంగంగా మారిపోయింది. జీతాలు పెంచాలని కార్మికులు చేసిన ఆందోళన హింసకు దారితీయడంతో నోయిడాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

ఉత్తరప్రదేశ్ నోయిడా సిటీలోని ఫేజ్-2 పారిశ్రామిక వాడలో జీతాలు పెంచాలని కార్మికులు భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళనకు దిగారు. వీక్లీ ఆఫ్, గ్రీవియెన్స్ సెల్, పే స్లిప్స్, ఇన్సూరెన్స్, వేధింపుల నివారణకు కమిటీ, చేసిన పనికి సరైన జీతం, బోనస్, అదనపు పనికి ఓటీ చెల్లించాలనే డిమాండ్స్ తో గత నాలుగు రోజులుగా కార్మికులు ధర్నా చేస్తున్నారు. సోమవారం (ఏప్రిల్ 23) శాంతియుత ధర్నా కాస్త హింసాత్మకంగా మారింది. 

పరిస్థితి చేయి దాటడంతో భారీ సంఖ్యంలో పోలీస్ బలగాలను మోహరించారు. కార్మికులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో కార్మికులు రాళ్లు రువ్వడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. 

కార్మిక వాడలో శాంతియుత వాతావరణం కోసం నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, యూపీ లేబర్ కమిషనర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్కర్స్ అదనపు పనికి డబుల్ పేమెంట్స్, బోనస్, వారాంతపు సెలవులు మొదలైన అంశాలపై చర్చించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. త్వరలోనే కార్మికులతో చర్చలు జరిపి పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు. 

కార్మికుల డిమాండ్లు:

  • వీక్లీ ఆఫ్
  •  గ్రీవియెన్స్ సెల్
  • పే స్లిప్స్
  • ఇన్సూరెన్స్
  • వేధింపుల నివారణకు కమిటీ
  • చేసిన పనికి సరైన జీతం
  • బోనస్, 
  • అదనపు పనికి ఓటీ 
©️ VIL Media Pvt Ltd.