
విజయవాడ నగరంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో నాటు పుట్టగొడుగులకు (మష్రూమ్) విపరీతమైన డిమాండ్ నెలకొంది. సాధారణంగా వర్షాకాలంలో నెల రోజుల పాటు మాత్రమే లభించే ఈ సహజ పుట్టగొడుగులను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ.. కొనుగోలు చేయడానికి వెనుకాడటం లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి నాటు పుట్టగొడుగులను తీసుకొచ్చి విజయవాడలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క కట్ట పుట్టగొడుగును రూ.500కు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ రుచి తెలిసిన వినియోగదారులు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు.
నాటు పుట్టగొడుగులకు ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. సూపర్ మార్కెట్లలో లభించే సాధారణ మష్రూమ్లతో పోలిస్తే.. సహజంగా అడవులు, పొలాల్లో పెరిగే నాటు పుట్టగొడుగుల రుచి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ధరలు ఎక్కువగా ఉండటంతో కొంతమంది వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతుండగా.. మరికొందరు మాత్రం ‘రుచి కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం’ అంటూ కొనుగోలు చేస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే లభించే అరుదైన ఆహార పదార్థం కావడంతో ప్రతి ఏడాది ఈ సమయంలో నాటు పుట్టగొడుగులకు భారీ గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడ మార్కెట్లో మష్రూమ్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.