Reading Time: < 1 minute
Sangareddy: కాలం మారినా స్నేహం మారలేదు.. 37 ఏళ్ల తర్వాత ఐటీఐ మిత్రుల ఆత్మీయ కలయిక

కాలం పరుగులో మూడు దశాబ్దాలకు పైగా గడిచిపోయినా… ఆ నాటి స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తాము చదివిన ఐటీఐ క్యాంపస్‌లోకి అడుగుపెట్టగానే… నాటి తరగతి గదులు, వర్క్‌షాప్‌లు, గురువులు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు ఒక్కసారిగా కళ్లముందు కదలాడాయి. ఆ జ్ఞాపకాలతో పలువురు భావోద్వేగానికి గురయ్యారు. సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో 1987–89 ఫిట్టర్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు.

ఈ కలయికలో హోదాలు, ఆర్థిక స్థాయిలు, ఉద్యోగాలు అన్నింటినీ పక్కనబెట్టి… ప్రస్తుతం ఎవరెవరు ఏ రంగాల్లో స్థిరపడ్డారు, జీవిత ప్రయాణం ఎలా సాగిందనే విషయాలను పరస్పరం పంచుకున్నారు. ఐటీఐ రోజుల్లో చేసిన అల్లరి, వర్క్‌షాప్ అనుభవాలు, గురువుల బోధనలు గుర్తు చేసుకుంటూ రోజంతా ఆనందోత్సాహాల మధ్య గడిపారు.

కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాలు, వ్యాపారాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ… స్నేహం కోసం ఒక్క పిలుపుతో అందరూ ఒకేచోట చేరడం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ ఆత్మీయ సమ్మేళనం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడమే కాకుండా… భవిష్యత్తులోనూ ఒకరికొకరు అండగా ఉంటామనే నమ్మకాన్ని మరింత బలపరిచిందని పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనం… స్నేహానికి కాలంతో పనిలేదని, హోదాలతో సంబంధం లేదని మరోసారి చాటిచెప్పింది. 37 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మధుర కలయిక అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది.